పయనించే సూర్యుడు న్యూస్, జూలై 7, సింగరేణి రిపోర్టర్ నరేష్ కారేపల్లి: వర్షాకాలంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, అంటువ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఉసిరికాయలపల్లి గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో పారిశుధ్య పనులను ముమ్మరం చేశారు. గ్రామ సర్పంచ్ వరలక్ష్మి రాజు నాయకత్వంలో గ్రామవ్యాప్తంగా ప్రత్యేక శుభ్రత కార్యక్రమాలు చేపట్టారు. గ్రామంలోని ప్రధాన రహదారులు, కాలనీలు, డ్రైనేజీలు, నీరు నిల్వ ఉండే ప్రాంతాలను పరిశుభ్రం చేయడంతో పాటు బ్లీచింగ్ పౌడర్ చల్లి పారిశుధ్య చర్యలను చేపట్టారు. వర్షాకాలంలో దోమలు, ఈగలు పెరగకుండా నియంత్రించి ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు ఈ కార్యక్రమం నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ వరలక్ష్మి రాజు మాట్లాడుతూ, గ్రామ ప్రజలు తమ ఇళ్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఎక్కడా వర్షపు నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. దోమల నివారణకు ప్రతి కుటుంబం సహకరించాలని, గ్రామంలో పారిశుధ్య నిర్వహణకు పంచాయతీ ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతుందని తెలిపారు. ప్రజారోగ్య పరిరక్షణే లక్ష్యంగా గ్రామంలో అవసరమైన అన్ని పారిశుధ్య చర్యలను నిరంతరం కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సిబ్బంది, పారిశుధ్య కార్మికులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు పాల్గొని గ్రామ పరిశుభ్రతకు తమ వంతు సహకారం అందించారు.